- ముగింపుదశకు చేరుకున్న మూల్యాంకనం..
- కసరత్తు చేస్తున్న ప్రభుత్వ విద్య శాఖ..
రాష్ట్రంలో ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 ఫలితాల కోసం లక్షలాది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం ముగింపు దశకు చేరుకుంది. ఏప్రిల్ 9వ తేదీతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూల్యాంకనం ప్రక్రియ ముగియనుంది. తర్వాత ఫలితాల విడుదల ప్రక్రియకు మరో ఐదు నుంచి ఆరు రోజుల సమయం పడుతుంది. దీంతో ఫలితాలను ఈ నెల మూడో వారంలో అంటే ఏప్రిల్ 15వ తేదీ తర్వాత విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.
ఇక పదో తరగతి ఫలితాలను కూడా ఏప్రిల్ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి మొదలైంది. ఇది ఏప్రిల్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక మార్కులను ప్రాసెస్ చేయడానికి 8 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఇది పూర్తి కాగానే ఏప్రిల్ 25వ తేదీ తర్వాత పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తోంది. కాగా గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 16న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పేపర్తో ముగిశాయి.
