- స్పందించిన అధికారులు, బీసీ కాలనీలో రేషన్ సమస్యకు పరిష్కారం
రాజకీయ నాయకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా బీసీ కాలనీలో ప్రజలు రేషన్ బియ్యం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రేషన్ సబ్ సెంటర్ లేకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ సమస్యలను “ఆదాబ్ హైదరాబాద్” దినపత్రిక వరుస కథనాల రూపంలో ప్రాముఖ్యంగా వెలుగులోకి తీసుకురావడంతో, సమస్యపై ఉన్నతాధికారుల దృష్టి సారించింది. కథనాల ప్రభావంతో అధికారులు వెంటనే స్పందించి, పరిస్థితిని సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టారు.

దీని ఫలితంగా బీసీ కాలనీలో కొత్త రేషన్ షాప్ ప్రారంభానికి మార్గం సుగమమై, స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించింది. ఇకపై రేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కాలనీలోనే సరుకులు అందుబాటులోకి వచ్చాయి.
శుక్రవారం రోజున బీసీ కాలనీలో నూతన రేషన్ షాప్ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. ఎక్కడైనా నిర్లక్ష్యం చోటుచేసుకుంటే కఠిన చర్యలు తప్పవు. బీసీ కాలనీలో రేషన్ సమస్యను పరిష్కరించాం, ఇకపై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సరఫరా జరిగేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉంటుంది” అని స్పష్టం చేశారు.

స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇక తొలగిపోయాయని చెప్పారు. ప్రజా సమస్యలను పట్టుదలగా వెలుగులోకి తీసుకువచ్చిన “ఆదాబ్ హైదరాబాద్” కథనాలు ఫలితాన్నిచ్చి, అధికార యంత్రాంగాన్ని కదిలించగలిగిన ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది.
