- 10వ తరగతి ఫలితాలు ప్రకటించక ముందే ఇంటర్ క్లాసులు ప్రారంభం
- నారాయణ కాలేజీ సి.బి.ఎస్.సి 10వతరగతి విద్యార్థులకు గుదిబండ..
- నేటికీ సి.బీ.ఎస్.సి. ఫలితాలు ప్రకటించనేలేదు..
- పరీక్షలు పూర్తి అయ్యి ఇప్పటికీ కేవలం 10 రోజులే అయ్యింది..
విద్యా వ్యవస్థలో విలువల కంటే వ్యాపారమే పరమావధిగా భావిస్తున్న నారాయణ యాజమాన్యం మరోసారి బరితెగించింది. విద్యార్థుల భవిష్యత్తును. ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ తనదైన శైలిలో ‘అక్రమ’ అడుగులు వేస్తోంది. పది పరీక్షలు ముగిసి పది రోజులు కూడా గడవకముందే, కనీసం ఫలితాలు కూడా విడుదల కాకముందే.. అప్పుడే ఇంటర్మీడియట్ క్లాసులకు తెరలేపడం విద్యాలోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులను యంత్రాలుగా మార్చి, వారిపై మానసిక ఒత్తిడిని పెంచుతూ. విద్యాశాఖ మార్గదర్శకాలను తుంగలో తొక్కి నారాయణ సంస్థ సాగిస్తున్న ఈ ‘ముందస్తు’ దందాపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చదువుల కోవెలలో సాగుతున్న ఈ వాణిజ్య వేటపై విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటని విద్యార్థి సంఘాల వారు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్, మార్చి 25 (ఆదాబ్ హైదరాబాద్) : అవినీతిలో సంచలనాలకు కేంద్రబింధువై ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న నారాయణ యాజమాన్యం మరోసారి నిస్సిగ్గుగా నిబంధనలను ఉల్లగించింది.. నారాయణ కాలేజీ సి.బీ.ఎస్.ఈ. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభించింది.. దారుణం ఏమిటంటే సి.బీ.ఎస్.ఈ. 10వ తరగతి ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.. అంతేకాదు పరీక్షలు పూర్తయ్యి కేవలం 10 రోజులే అయ్యింది..
నిస్సిగ్గుగా నిబంధనల ఉల్లంఘన : ఫలితాలు ప్రకటించే ముందు ఇంటర్మీడియట్ అడ్మిషన్లు/క్లాసులు ప్రారంభించడం విద్యా నియమాలకు విరుద్ధం.. విద్యార్థి ఉత్తీర్ణత నిర్ధారణ లేకుండానే తదుపరి తరగతి బోధన ప్రారంభించడం తప్పు.. సి.బీ.ఎస్.ఈ. అలాగే ఇంటర్మీడియట్ బోర్డ్ మార్గదర్శ కాలను కూడా ఉల్లంఘించడం కూడా నేరం అవుతుంది..
విద్యార్థులపై ప్రభావం : విద్యార్థులపై అనవసర మానసిక ఒత్తిడి పెరుగుతుంది.. తల్లిదండ్రులను తొందరపాటు నిర్ణయాలకు దారి తీయడం జరుగుతుంది.. ఫలితాల ముందు కోర్సు ఎంపికలో గందరగోళం నెలకొంటుంది..
అనైతిక చర్యలు : ముందస్తు అడ్మిషన్ల కోసం విద్యార్థులను ఆకర్షించడం వారిని ఒత్తిడి చేయడం జరుగుతోంది.. విద్యా వ్యవస్థ నైతికతను దెబ్బతీయడం. వాణిజ్య ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటం జరుగుతోంది..
కోరుతున్న చర్యలు : వెంటనే విచారణ జరపాలి.. కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి చర్యలు మరెక్కడా జరగకుండా ఆదేశాలు జారీ చేయాలి.. విద్యార్థుల హక్కులు, భవిష్యత్తు రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
కాగా ఈ క్రమంలో సీబీఎసఈ 10వ తరగతి ఫలితాలు ప్రకటించకముందే జూనియర్ ఇంటర్మీడియట్ తరగతులను ప్రారంభించడం, అమల్లో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలు, విద్యా నియం త్రణ మార్గదర్శకాలకు విరుద్ధమని తెలియజేస్తూ తెలంగాణ ఇంటర్మీడియెట్ కార్యదర్శికి ఒక వినతిపత్రం సమర్పించారు విద్యార్థి సంఘం నాయకులు ఈ అక్రమచర్యలను వెంటనే నిలిపి వేయకపోతే, సంబంధిత విద్యా అధికారులు, నియంత్రణ సంస్థ లు, విజిలెన్స్ విభాగాల ముందు అధికారిక ఫిర్యాదులు దాఖలు చేయబడతాయి.
అవసరమైతే, సంబంధిత చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. విద్యార్థుల హక్కులు, విద్యా ప్రమాణాలను కాపాడడం మీ బాధ్యతగా పరి గణించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.. విద్యాశాఖ ఉన్నతాధికారులు నారాయణ విద్యాసంస్థలు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. తక్షణమే చర్యలకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు..
