- వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని నల్గొండ ఎస్పీకి ఆదేశం
జిల్లాలో సంచలనం సృష్టించిన హత్యాయత్నం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ దారుణ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టి, వారం రోజుల్లోగా సమగ్రమైన ‘చర్యల నివేదిక’ (Action Taken Report) సమర్పించాలని నల్గొండ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ను కమిషన్ ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది వినోద్ హిందుస్థానీ అందించిన ఫిర్యాదు మేరకు కమిషన్ ఈ కేసును విచారణకు స్వీకరించింది.ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చండూరు బీజేపీ కార్యకర్తలు దోటి కిరణ్ సహా మరో ఏడుగురిపై కొందరు దుండగులు పథకం ప్రకారం ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘోరం జరిగి 48 గంటలు గడిచినా పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదని వినోద్ హిందుస్తానీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

కమిషన్ ఆదేశాలు ఇవే.. (Case No-210/36/7/2026): బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి ఈ కేసులో తీసుకున్న చర్యల నివేదికను ఆంగ్లంలోకి అనువదించి ఒక వారం లోపు కమిషన్కు పంపాలి. సంబంధిత వివరాలను హెచ్ఆర్సీ నెట్ పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించాలని, ఈమెయిల్ నివేదికలను పరిగణించబోమని కమిషన్ స్పష్టం చేసింది.

నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
