- పర్వతగిరి మండల విద్యా శాఖాధికారి ఏ బిక్షపతి.
పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ బిక్షపతి తెలిపారు. రెండు పరీక్ష కేంద్రాల ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరెండెంట్ లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్ లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఇన్విలేటర్లు తీసుకోవలసిన జాగ్రత్తలను, మార్గదర్శకాలను వారికి వివరించడం జరిగిందనీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్వతగిరి మండలంలో మొత్తం 12 ప్రభుత్వ పాఠశాలలు, 4 ప్రైవేట్ పాఠశాలల నుండి మొత్తం 530 మండి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
పర్వతగిరి మండల కేంద్రంలో పర్వతగిరి ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశామని తెలిపారు. పర్వతగిరి ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 290 మంది విద్యార్థులు సాంఘిక సంక్షేమ బాలికల విద్యాలయం పరీక్ష కేంద్రంలో 240 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.
రెండు పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరెండేంట్ నవీన్ కుమార్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కుమారస్వామి, పర్వతగిరి గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రం చీఫ్ సూపరెండెంట్ హేమమాలిని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు.
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్.
పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఈస్ట్ డీసీపీ తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు తెలిపారు. రేపటి నుండి ఏప్రిల్ 16 నుండి 2026 వరకు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని డీసీపీ తెలిపారు.
- పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.
- సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు నిషేధం.
- పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు తేది రేపటి నుండి ఏప్రిల్ 16 నుండి 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని డీసీపీ ఆదేశించారు.
ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని డీసీపీ హెచ్చరించారు.
