- అక్రమ ఇటుక బట్టిపై పంచాయతీ కార్యదర్శి నోటీసులు
కుకునూరుపల్లి మండలం మంగోలు గ్రామంలో వ్యవసాయ భూమిలో కొనసాగుతున్న అక్రమ ఇటుక బట్టిపై వెలువడిన ఆదాబ్ హైదరాబాద్ కథనానికి స్థానిక అధికారులు స్పందించారు. సర్వే నంబర్లు 58, 59లో సుమారు 9 ఎకరాల వ్యవసాయ భూమిలో అనుమతులు లేకుండా ఇటుక బట్టి నిర్వహిస్తున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి సంబంధిత యజమానికి నోటీసులు జారీ చేశారు. నోటీసులో భూమి వినియోగ మార్పు, పర్యావరణ అనుమతులు, ఇతర సంబంధిత పత్రాలు సమర్పించాలని ఆదేశించారు.

మూడు రోజులలోపు అవసరమైన డాక్యుమెంట్లు అందజేయాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించడం, అలాగే బట్టిల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు విద్యకు దూరమవుతున్నారనే అంశాలపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బట్టిని మూసివేయడమే కాకుండా తదుపరి చర్యలు చేపడతామని హెచ్చరించారు.

