హైదరాబాద్లోని లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), దాద్రా మరియు నాగర్ హవేలి(Dadra and Nagar Haveli), డామన్ మరియు డయ్యూ(Daman and Diu)ల ఆవిర్భావదినోత్సవాలు (Formation Day Celebrations) శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ గవర్నర్(Governor of Telangana) జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఈ మూడు ప్రాంతాల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయా ప్రాంతాల గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. దేశ ఐక్యత, ప్రజాస్వామ్య నైతికతలో అవి పోషించిన గణనీయమైన కృషిని హైలైట్ చేశారు. ఉత్తరప్రదేశ్ను దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివర్ణించారు. ఆ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. భిన్నత్వంలో ఏకత్వం, భాగస్వామ్య విలువలు, సామూహిక బాధ్యతను ప్రతిబింబించే భారతీయతను విశదీకరించారు.
దాద్రా మరియు నాగర్ హవేలి, డామన్ మరియు డయ్యూలను భారత యూనియన్లో విజయవంతంగా ఏకం చేయడాన్ని గవర్నర్ ప్రశంసించారు. ఆయా ప్రాంతాల సముద్ర వారసత్వం, గిరిజన సంప్రదాయాలు, సమగ్ర అభివృద్ధికి కితాబిచ్చారు. సహకార సమాఖ్యవాదం, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ చొరవను నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో గంగా అవర్తన్-కథక్, ఉత్తరప్రదేశ్ ఖజురి భజనలు, ఝాన్సీకి రాణి ఫ్యూజన్ నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఇవి ఆయా ప్రాంతాల కళాత్మక వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి.
ఈ వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నుంచి ఎంపీ అనురాగ్ శర్మ, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, ఐఏఎస్; యశ్ భారతి అవార్డు గ్రహీత స్వామీజీ ఓమా ఉపాధ్యాయ్; హైదరాబాద్లోని ఉత్తరప్రదేశ్, దాద్రా మరియు నాగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ కమ్యూనిటీల ప్రముఖులు, సభ్యులు హాజరయ్యారు.
ఈ వేడుకలు సాంస్కృతిక పరిరక్షణ, సమ్మిళిత పురోగతి, జాతీయ ఐక్యతకు ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. ప్రతి ప్రాంతం దేశ సమిష్టి బలానికి దోహదపడుతోందని చెప్పారు.
