- ఈ శని, ఆదివారాల్లో తిరుగు ప్రయాణాలకు సన్నాహాలు..
- ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాల మళ్లింపు ప్రక్రియ..
- కీలక నిర్ణయాలు తీసుకున్న నల్గొండ పోలీసులు..
సంక్రాంతి సంబురాల ముగింపుతో పల్లెలకు వెళ్లిన వారు ఇళ్లకు చేరే సమయం ఆసన్నమైంది. శని, ఆదివారాల్లో నగరాలకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో రోడ్లు జామ్ కాకుండా, ట్రాఫిక్ చిక్కులు ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు మళ్లీ పట్నంబాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు నల్గొండ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల,పెద్ద కాపర్తి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటతంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.
దారి మళ్లింపు వివరాలు :
గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ విరీదుగా హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలలను మాచర్ల, నాగార్జునసాగర్, పెద్దవూర, కొండపల్లేపల్లి, చింతపల్లి, మాల్ విరీదుగా హైదరాబాద్ మళ్లిస్తారు. నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను నల్లగొండ, మర్రిగూడ బై పాస్, మునుగోడు , నారాయణపూర్, చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65) విరీదుగా హైదరాబాద్ తరలిస్తారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ విరీదుగా హైదరాబాద్ మళ్లించారు. ఎన్.హెచ్. 65 విజయవాడ, హైదరాబాద్ రహదారిపై చిట్యాల,పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి గుండా హైద్రాబాద్ మళ్లించడం జరుగుతుంది.ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైద్రాబాద్ పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.
