అతని కుటుంబానికి రూ.2 కోట్ల నష్టపరిహారం (Compensation) ఇవ్వాలి
500 గజాల స్థలం కేటాయించాలి
కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం (Government Job) ఇవ్వాలి
సాయి ఆత్మకు శాంతి చేకూరేందుకు స్థానిక ఎన్నికలు (Local Elections) వాయిదా వెయ్యాలి
నిర్వహించాలనుకుంటే BCలకు 42% రిజర్వేషన్ల(BC Reservations)తో ఎన్నికలు జరపాలి
తెలంగాణా బీసీ జాక్ చైర్మన్ ఆర్.కృష్ణయ్య డిమాండ్
BCల హక్కుల సాధన కోసం ఆత్మాహుతి చేసుకున్న సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని తెలంగాణా బీసీ జాక్ చైర్మన్ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సాయి ఈశ్వర్ చారి పార్థివదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఆర్.కృష్ణయ్యతోపాటు వకుళాభరణం కృష్ణమోహన్రావు(Vakulabharanam Krishnamohan Rao), గుజ్జ సత్యం(Gujja Satyam), డాక్టర్ ర్యాగా అరుణ్కుమార్ (Ryaga Arun Kumar) తదితరులు ఉన్నారు.
BC రిజర్వేషన్ల అమలు, ప్రయోజనాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ఈ విషాదానికి కారణమని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట బీరయ్య నగర్లోని సాయి ఈశ్వర్ చారి నివాసానికి శనివారం చేరుకున్న BC నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. సాయి ఈశ్వర్ చారిని స్మరిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున్న నినాదాలతో హోరెత్తించారు. సాంసృతిక కళాకారులు ఉద్యమ పాటలు పాడారు.

ఈ సందర్భంగా ఎంపీ(రాజ్యసభ ), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. సాయి ఈశ్వర్ చారి త్యాగం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ప్రజల ఆవేదనను ప్రభుత్వం తేలికగా తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సాయి ఈశ్వర్ చారి ఆశయ సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ‘స్థానిక ఎన్నికలను వెంటనే వాయిదా వెయ్యాలి. 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లోని హామీలను నెరవేర్చాలి’ అని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.
రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ.. సాయి ఈశ్వర్ చారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం నియంత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. సాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్పూర్తితో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ర్యాగా అరుణ్కుమార్ మాట్లాడుతూ.. బీసీల హక్కుల సాధన కోసం ప్రాణత్యాగాలు చేసే పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. సాయి ఈశ్వర్ చారి మరణం తెలంగాణ ప్రభుత్వానికి తీవ్రమైన హెచ్చరిక అని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మాట్లాడుతూ.. హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీసీ బహుజన యువకులు ఇలాంటి చర్యలకు దిగడం సమాజానికి బాధాకరమని చెప్పారు. తెలంగాణ సాధనలో 1200 మందికి పైగా బీసీ బహుజన, వంచిత వర్గాల బిడ్డలు ప్రాణాలు అర్పించారని, ఇది ఇక చాలు అని సూచించారు. ఇక నుంచి బలిదానాలు కాదు.. పోరాటమే మార్గమని సూచించారు.
