తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీ(PM Modi)ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేకంగా ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhattivikramarka)తో కలిసి ఢిల్లీ పార్లమెంట్ భవన్లోని ప్రధాని కార్యాలయంలో మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
- కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ తనవంతుగా దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం రూపొందించినట్లు సీఎం వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్ను రూపొందించినట్లు చెప్పారు.
- వివిధ రంగాల్లో నిష్ణాతులు, నిపుణులు, నీతి ఆయోగ్ సలహాలు, సూచనలను క్రోడీకరించి మేధోమథనం అనంతరం విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు చెప్పారు.
- తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఫలితాలు సాధించడంలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహాకారాలు అందించాలని ఈ సందర్భంగా సీఎం ప్రధానిని కోరారు.
- హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవున విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని, రూ.43,848 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
- హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినేట్ ఆమోదంతోపాటు ఆర్థికపరమైన అనుమతులు, అలాగే దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.
- రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
- హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు హైస్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
- హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు వరుసల ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.
- Advertisement -
