- త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో నిర్వహణ..
- కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్
దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాలలో సవరణలను చేపట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. తొలిదశ బీహార్లో విజయవంతంగా ముగిసిందని మలిదశ త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో నిర్వహిస్తామని అన్నారు. సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ వివరాలను సీఈసీ వెల్లడించారు. రెండో విడతలో 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయని చెప్పారు. వీటిలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్టాల్రు ఉన్నాయి.
వివిధ రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాను నవీకరించడం, ధృవీకరించడం, అనర్హులైన ఓటర్లను తొలగించడం, నిజమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడానికి ఎన్నికల కమిషన్ ఈ పక్రియ చేపడుతోంది. ఎన్నికల జాబితా క్వాలిటీపై ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్నందున ఎస్ఐఆర్ పక్రియ చేపట్టడం అవసరమైందని సీఈసీ చెప్పారు. 1951 నుంచి 2004 వరకూ 8 సార్లు ఎస్ఐఆర్ నిర్వహించామని, చివరిసారిగా 21 ఏళ్ల క్రితం 2002-2004 మధ్య చేపట్టామని చెప్పారు.
ఈ క్రమంలో ఇటీవల బీహార్లో తొలి విడత ఎస్ఐఆర్ పూర్తి చేసినట్టు చెప్పారు. ఎస్ఐర్ ఫేజ్-2 షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకూ ప్రింటింగ్ / ట్రైనింగ్ ఉంటుంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకూ హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ ఫేజ్ ఉంటుంది. హియరింగ్ / వెరిఫికేషన్ పక్రియ డిసెంబర్ 9 నుంచి 2026 జనవరి 31 వరకూ జరుగుతుంది. 2026 ఫిబ్రవరి 7న తుది ఎన్నికల జాబితా విడుదలవువుంది. రెండో విడత ఎస్ఐఆర్ జరుగనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తమిళనాడు, గోవా, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, రాజస్థాన్ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి.
