- అక్కడి ఆత్మీయుల యోగక్షేమాలపై బంధువుల ఆందోళన
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకరపోరు కొనసాగుతుండగా యుద్ధంలో గాజా సరిహద్దుకు ఇరువైపులా ఇప్పటివరకూ పౌరులు సహా 3000 మందికిపైగా మరణించారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో భారత్లో నివసిస్తున్న ఇజ్రాయెల్ వాసులు భయాందోళన మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. స్వదేశంలో తమ ఆత్మీయుల భద్రతపై ఆరా తీస్తూ ఆందోళన చెందుతున్నారు. వీరిలో కొందరు ఇజ్రాయలీలు కొద్దికాలంగా భారత్లో నివసిస్తుండగా, మరికొందరు టూరిస్ట్లుగా ఇక్కడికి వచ్చారు. ఇజ్రాయెల్లో మారణహోమంతో కలత చెందిన వీరు స్వదేశానికి చేరుకుని తమ వారి చెంతకు చేరాలని తహతహలాడుతున్నారు. హమాస్ మెరుపుదాడుల అనంతరం తమ కుటుంబసభ్యులతో మాట్లాడానని హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో నివసిస్తున్న ఇజ్రాయెల్ మహిళ కెనెరియత్ గుర్తుచేసుకున్నారు. హమాస్ మిలిటెంట్ల బాంబు దాడితలో తమ ఇల్లు దగ్ధమైందని ఆమె చెప్పుకొచ్చారు. తన సోదరుడితో తాను మాట్లాడనని, తమ కజిన్ హమాస్ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. భారత్లో తాము సురక్షితంగా ఉన్నా వీలైనంత త్వరలో ఇజ్రాయెల్ వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకోవాలని ఉందని చెప్పారు. తమ స్వదేశం వెళ్లేందుకు తానెన్నడూ ఇంతగా భయపడలేదని అన్నారు. రాజస్ధాన్లోని పుష్కర్ను సందర్శించిన ఇజ్రాయెలీ టూరిస్ట్ అమత్ తాను స్వదేశం వెళ్లి ఇజ్రాయల్ రక్షణ బలగాల్లో చేరి హమాస్ ఉగ్రవాదులతో పోరాడతానని చెప్పాడు. మహిళలు, చిన్నారులు, సైనికులపై హమాస్ చేపడుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఈనెల 15న ఇజ్రాయెల్కు తిరుగుముఖం పట్టనున్నట్టు అమత్ తెలిపాడు.