- రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం..
- ఇప్పటిదాకా 95 వేల డెంగీ కేసుల నమోదు..
- 91 మంది మరణించినట్లు తెలిపిన అధికారులు..
- ఇప్పటికే కావలసిన కిట్స్ అందజేశాం
: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ..
న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్తో సహా కొన్ని రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఈ ఏడాది ఇప్పటిదాకా 95వేల డెంగీ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే 91 మంది డెంగీ వల్ల మరణించారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఢిల్లీ, బిహార్, ఉత్తర్ప్రదేశ్, తెలంగాణ మహారాష్ట్ర,కర్ణాటక, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో డెంగీ కేసుల సంఖ్య పెరిగిపోతున్నట్లు ఆరోగ్యశాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. అన్ని రాష్ట్రాలకు స్క్రీనింగ్ కిట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అందిజేసిందని.. ఫాగింగ్తో సహా ఐఈసీ కార్యకలాపాల కోసం ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు తెలిపింది. అంతేకాదు ఆరోగ్య కార్యకర్తలకూ కూడా వీటిపట్ల ట్రైనింగ్ ఇచ్చామని చెప్పింది. డెంగీ నిర్మూలన, నిర్వహణలో భాగంగా పర్యవేక్షణ, కేసుల నిర్వహణ, ల్యాబ్ టెస్టులు, యాంటీజెన్ టెస్టు కిట్ల సేకరించడం వంటి వివిధ కార్యక్రమాల అమలు ప్రణాళిక కింద రాష్ట్రాలకు తగిన నిధులను కూడా అందుబాటులో ఉంచామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు.