- బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్..
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన దీక్షకు దిగారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షను ప్రారంభించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల అభ్యున్నతి జరగాలంటే, ముందుగా వారి జనాభా ఎంత ఉందో స్పష్టంగా తెలియాలని వీహెచ్ వాదిస్తున్నారు. జనగణనలో బీసీ కులాలను కూడా లెక్కించడం ద్వారానే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.
మే 8వ తేదీ లోపు ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు రావాలని వీహెచ్ గతంలోనే అల్టిమేటం ఇచ్చారు. ఈ లోపు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, తాను రాసిన లేఖలకు జవాబు లేకపోవడంతో ఆయన ఈరోజు దీక్షను ప్రారంభించారు. కేవలం బీసీల హక్కుల కోసమే ఈ పోరాటమని ఆయన స్పష్టం చేశారు.
