ఈ మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Rbi) చాలా మందికి ఒక సందేశాన్ని (Message) పదే పదే పంపిస్తోంది. వాట్సాప్, ఎస్సెమ్మెస్ల ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తోంది. ‘పాత బ్యాంకు ఖాతాల్లోని డబ్బును మర్చిపోయారా’ అంటూ గుర్తుచేస్తోంది. ఆ డబ్బును తిరిగి పొందడంలో మీకు సహాయం చేస్తామని చెబుతోంది.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
బ్యాంకుల్లోని మీ అకౌంట్లు గానీ మీ కుటుంబ సభ్యుల అకౌంట్లు గానీ 10 ఏళ్లకు పైగా యాక్టివ్గా లేకపోతే వాటిలోని డబ్బు RBI ఆధ్వర్యంలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్(Depositor Education and Awareness Fund)లో ఉండొచ్చు. కాబట్టి ఆ డబ్బును ఇప్పటికీ తిరిగి పొందొచ్చని కేంద్ర బ్యాంక్ (Central Bank) చెబుతోంది. ఖాతాల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను udgam.rbi.org.in అనే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. తనిఖీ చేసుకున్న అనంతరం మీ బ్యాంక్కు సంబంధించిన ఏదైనా బ్రాంచ్కి వెళ్లాలి. ఆధార్, పాస్పోర్ట్, ఓటర్ ఐడీ.. లేదా.. డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలు సమర్పించి కేవైసీ (Kyc) పూర్తిచేయాలి.
డబ్బును తిరిగి పొందే అర్హత మీకు ఉంటే వడ్డీతో సహా చెల్లిస్తారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించటం కోసం ఆర్బీఐ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది. అక్టోబర్లో ప్రారంభమైన ఈ క్యాంప్లు డిసెంబర్ వరకు కొనసాగుతాయి. అందువల్ల.. ‘‘విషయాలు తెలుసుకోండి.. జాగ్రత్తగా ఉండండి’’ అని ఆర్బీఐ సూచిస్తోంది.

