బీసీ బిల్లు ఆమోదిస్తారా? రాజీనామా చేస్తారా?
గవర్నర్ను డిమాండ్ చేసిన బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్
బీసీలు ఎదగడం ఇష్టం లేదా అని ప్రశ్న
బీసీ బిల్లు(BC Bill)ను వెంటనే ఆమోదించాలని, లేనిపక్షంలో గవర్నర్ (Governor) తన పదవికి రాజీనామా చేయాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూలులో చేర్చాలనే డిమాండుతో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం “ఛలో రాజ్భవన్” (Chalo RajBhavan) కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున రాజ్ భవన్ ముట్టడికి బయల్దేరిన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన (Protest) చేపట్టారు.

ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్(Ordinance)ను గవర్నర్ తన వద్దనే ఉంచుకొని సంతకం చేయకుండా ఆలస్యం చేస్తున్నారని, గవర్నర్ కేంద్ర ప్రభుత్వాని(Central Government)కి ఏజెంట్లా వ్యవహరిస్తూ బీసీల హక్కులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం” అని ఆరోపించారు. బీజేపీ (Bjp) ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని, బీసీల సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని గవర్నర్ నిలువరించడం దురదృష్టకరమని, ఇది బీసీలను రాజకీయంగా వెనక్కి నెట్టే కుట్ర” అని మండిపడ్డారు.
గవర్నర్ వెంటనే ఆర్డినెన్స్పై సంతకం చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ధర్నా అనంతరం నాయకులు గవర్నర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ IAS చిరంజీవులు, ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు జి. కిరణ్ కుమార్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జి గణేష్, నాయకులు అయిలి వెంకన్న, దుర్గయ్య గౌడ్, సింగం నగేష్, బైరు శేఖర్, వివి గౌడ్, గోటూరి రవీందర్, గూడూషా, అంజన్న యాదవ్, దేవర శివ, ధర్మేంద్ర సాగర్, రాఘవేందర్ గౌడ్, రామన్ గౌడ్,యశ్వంత్,రమేష్,నాగరాజు, రవి నాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు.
