- ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాహుల్ యాదవ్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్లంపేట మున్సిపాలిటీ రావల్కోల్ గ్రామం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో క్రీడా పోటీలు మరియు బహుమతుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాహుల్ యాదవ్ సహకారం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక దృఢత్వం, క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించగా, వాటిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయబడ్డాయి అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు జట్టు భావం అలవడుతాయని మామిండ్ల రాహుల్ యాదవ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండాలని కోరారు, క్రీడలే ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాదని ఆయన అన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
