- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
భగీరథ మహర్షి యువతకు స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మహర్షి భగీరథుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిమాలయాల నుండి గంగానదిని భూమికి తీసుకువచ్చి మానవాళి దాహాన్ని తీర్చిన మహానుభావుడు భగీరథుడని తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం చేసిన ఆయన కృషి భారత చరిత్రలో మహత్తర ఘట్టంగా నిలిచిందన్నారు. ఒక వ్యక్తిగా ఆయన చేసిన ప్రయత్నం లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేసి, భారతదేశాన్ని అన్నపూర్ణగా నిలిపిందని ఆయన కొనియాడారు. భగీరథ మహర్షి త్యాగం, సంకల్పం, పట్టుదల ప్రతి యువకుడికి ఆదర్శమని, కష్టసాధ్యమైన పనులను సాధించడానికి ఆయన జీవితం మార్గదర్శకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజ సేవలో అంకితభావంతో ముందుకు సాగాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కుష్బూ గుప్తా, మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, డిసిసి ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, నగర కార్పొరేటర్లు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
