- యువతరం వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
- బికెఎంయు జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రాములు.
ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ కొండిగారి రాములు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మరణించారన్న వార్త దిగ్భ్రాంతిని కలగజేసిందని, పీడిత తాడిత ప్రజలకు వారు చేసిన సేవలు మరువరానివని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు సంతాప ప్రకటనలో అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పదేళ్లపాటు శాసనసభలో రైతు కూలీల శ్రమజీవుల పక్షాన గళం విప్పారని, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారన్నారు.
నిస్వార్ధంగా నిజాయితీగా తాను నమ్మిన సిద్ధాంతానికి నిబద్ధుడై నిరాడంబరమైన జీవితం గడిపి తుదికంట ఉత్తమ కమ్యూనిస్టుగా ఆదర్శంగా నిలిచారన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా సాంఘిక సమానత్వం కోసం పేదలకు సాగు భూములు, ఇండ్ల స్థలాలు, పక్కా గృహాల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు కోసం వారు చేసిన పోరాటాలు సాధించిన విజయాలు అనన్య సామాన్యమన్నారు. రంగారెడ్డి జిల్లాలో వారితో కలిసి నేను పాల్గొన్న వ్యవసాయ కార్మిక పోరాటాలు మరువలేనివన్నారు.
రాములు తన జీవితాన్ని అట్టడుగు వర్గాల ప్రజల కోసం అంకితం చేశారని, అలాంటివారు నేటి సమాజంలో అరుదుగా ఉంటారన్నారు. ఈనాటి యువతరం వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకిత బావంతో కృషి చేయాలని అదే వారికి నిజమైన నివాళులు అర్పించినట్టు కాగలదని వెంకట్రాములు అన్నారు.
