Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణRevanth Reddy | కొలువుల పండుగ

Revanth Reddy | కొలువుల పండుగ

  • తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులపై చర్యలు
  • త్వరలోనే చట్టం తీసుకుని వచ్చి వారిని ఆదుకుంటాం
  • ఉద్యోగుల జీతాల్లో కోత విధించి తల్లిదండ్రులకు అందచేస్తాం
  • శిల్పకళావేదికలో గ్రూప్-2 నియామక పత్రాల కార్యక్రమం
  • అభ్యర్థులకు ఉద్యోగ పత్రాలు అందచేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • రాజ్యసభలో బలం లేకున్నా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్
  • రేవంత్ నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం యువతకు ఆశ
  • స్కిల్ యూనివర్సిటీతో ప్రైవేట్ ఉద్యోగాలకూ మార్గం : భట్టి

నిస్సహాయకులకు సహాయం అందించడమే మన బాధ్యత అని గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత.. మీరందరూ అందుకు అంకితమవు తారని పూర్తి విశ్వాసం ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగార్థులు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించు కోకపోతే మీ జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి తల్లి దండ్రుల ఖాతాలో వేస్తానని అన్నారు. ఒకటో తేదీ మీ జీతం ఎలా వస్తుందో.. అలాగే మీ తల్లిదండ్రుల అకౌంట్లో ఒకటో తేదీన పడుతుంది. దీని కోసం త్వరలో చట్టం తీసుకొస్తాం అని సీఎం రేవంత్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్.. చేతుల మీదుగా నియామక పత్రాలు అంద జేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… శ్రీకాంతాచారి, వేణు గోపాల్రెడ్డి, ఈషాన్రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి.. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిం చారు. యూనివర్సిటీల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, కానీ, ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు.. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మార్చుకొని పదేళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారు. కానీ, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువర్గాన్ని ఆగర్భ శ్రీమంతులు చేయటం కోసమే పదేళ్లు పరిపాలన సాగింది. ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం.. కూలేశ్వరం అయి ఉండేది కాదు. రూ. లక్ష కోట్లతో కట్టిన ఒక ప్రాజెక్టు మూడేళ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. తన ఫామ్ హౌజ్లో ఎకరా పంటపై రూ.కోటి ఆదాయం వస్తుందని ఒక పెద్దాయన చెప్పారు. ఎకరాపై రూ.కోటి ఆదాయం వచ్చే విద్యను యువత, ప్రజలకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. అలాంటి ప్రయోగం రైతులకు చెబితే రైతులంతా బాగుపడేవారు కాదా అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదవిన నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీ ఆశీర్వాదాలే కారణం. రూ.3కోట్లు తీసుకుని గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు ఆరోపణలు చేశారు. పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా? కష్టపడి చదివిన వారిని అవమానించేలా మాట్లాడారు. రాజకీయ చౌకబారు విమర్శలు విమర్శలు ఎదుర్కొన్నప్పుడు చాలా ఆవేదన కలిగింది. గతంలో ఎన్నడూ జరగని కులగణన.. కాంగ్రెస్ పోరాటం వల్లే త్వరలో సాధ్యం కానుందని రేవంత్రెడ్డి అన్నారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పదిహేనేళు గా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ పక్రియ పూర్తి చేశాం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. మిమ్మల్ని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుంది. మీరు.. మేము వేరు కాదు. మీరే మేము.. మేమే మీరు. చీకటి రోజులు పోవాలి..

నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్ 1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులు, ఇప్పటి వరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలి. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి. గత పాలకుల పాపాల పుట్ట పగులుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు.. వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్ తో మళ్లీ అధికారంలోకి రావాలను కుంటున్నారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగ ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్ తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి. సమర్థవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని కొత్తగా ఉద్యోగాల్లో నియమితులైన వారిని ఉద్దేశించి సిఎం ప్రసంగించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News