‘‘వాయిదా పద్ధతుంది దేనికైనా’’ అనే సినిమా డైలాగ్ నేటి కాలానికి అచ్చంగా సరిపోతోంది. ప్రస్తుత సమాజం మొత్తం వాయిదాల చుట్టూనే తిరుగుతోంది. లక్షల కోట్ల వ్యాపారం చేసే సంస్థలైనా, సామాన్య వినియోగదారులైనా వాయిదా చెల్లింపుల ద్వారానే లాభాలు, కొనుగోళ్లు సాధ్యమవుతున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ మొదలు ఎలక్ట్రానిక్స్ కంపెనీల వరకు ప్రతి సంస్థ నెలనెలా వాయిదాల పద్ధతినే ఆశ్రయించి తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.
వాయిదాల పర్వం ? తగ్గుతున్న కొనుగోలు శక్తి :
ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతున్న కొద్దీ ఉత్పత్తి రంగం కూడా దెబ్బతింటోంది. నిత్యావసరాలైతే తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నా, మిగతా అవసరాలన్నీ వాయిదాల విూదే ఆధారపడుతున్నాయి. ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబాలే కాదు, ఉన్నత వర్గాలు, వ్యాపారులు కూడా వాయిదాల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు.
‘‘ఇప్పుడు కొనండి? డబ్బుల సంగతి తర్వాత’’ అన్న నినాదంతో వాహనాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు ఇలా అన్నింటినీ వాయిదాల్లో అంటగడుతున్నారు కంపెనీలు. ప్రజలు కూడా అదే ఉత్సాహంతో కొనుగోలు చేసి సంబరపడుతున్నారు.
బంగారానికి ఎందుకు వాయిదాలు లేవు.?
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఇంట్లో ఉండే దాదాపు ప్రతి వస్తువుకు వాయిదా సౌకర్యం ఉన్నప్పుడు, మహిళలకు ఎంతో ప్రాధాన్యమైన బంగారానికి మాత్రం ఎందుకు లేదు?
కారు, ఫోన్, ల్యాప్టాప్ కొనే వారికి ఇబ్బడిముబ్బడిగా రుణాలు ఇచ్చే బ్యాంకులు, పేదవాడి ఇంట్లో పెళ్లికి అవసరమయ్యే బంగారం విషయంలో మాత్రం వెనకడుగు వేయడం ఎందుకు? అనే సందేహం సామాన్య ప్రజల మనసుల్లో మెదులుతోంది. కొన్ని పేరున్న సంస్థలు బంగారాన్ని వాయిదాల్లో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నా, అవి పట్టణాలకే పరిమితమయ్యాయి. గ్రావిూణ, మధ్యతరగతి కుటుంబాలకు వాటిపై సరైన అవగాహన లేదు. పెళ్లి, శుభకార్యాలకు అవసరమయ్యే బంగారాన్ని ప్రస్తుత ధరల వద్ద ఒక్కసారిగా కొనుగోలు చేయడం సగటు తండ్రికి భారంగా మారింది. పెరుగుతున్న ఖర్చులు ఒకవైపు, సామాజిక ఒత్తిళ్లు మరోవైపు బంగారం కొనడం పులివిూద పుట్రాలా మారింది.
స్వర్ణకారుల కష్టాలు ? కనిపించని బాధ :
ఇక మరోవైపు స్వర్ణకారుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. కొనుగోళ్లు లేక చేతికి పని లేక ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. అద్దెలు, జీతాలు, పన్నులు, నిర్వహణ ఖర్చులతో వ్యాపారం నడపలేక అవస్థలు పడుతున్నామని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నెల మొత్తం చూసినా పదుల సంఖ్యలో కూడా బేరాలు జరగడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నియంత్రిత వాయిదా పద్ధతిలో బంగారం కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తే, ఒకవైపు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తుంది. మరోవైపు స్వర్ణకారుల వ్యాపారాలకు ప్రాణం పోసినట్లవుతుంది.వాయిదాలు అన్ని వస్తువులకు ఉన్నప్పుడు. సమాజంలో అంతటి ప్రాధాన్యం ఉన్న బంగారానికి ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ చర్చ కొనసాగాల్సిందే..
