- కొనసాగుతున్న ఉల్లంఘన పర్వాలు..
- కేశవనగర్, ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీల్లో అక్రమ నిర్మాణాలు..
- సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసున్న స్థానికులు..
శేర్లింగంపల్లి జోనల్ పరిధిలోని, గచ్చిబౌలి డివిజన్, కేశవనగర్ ప్రాంతం అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది.. ఇక ఇదే తరహాలో ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీల్లో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు యథేచ్ఛగా వెలుస్తున్నా యని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములపై నిర్మాణాలు సాగుతుండటంతో నిర్మాణదారులు నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారని స్థానికులు వాపోతున్నారు..

అనుమతులు లేకపోయినా నిర్మాణాలు ఆగకపోవడం వెనుక భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని, ఒక్కో భవ నానికి లక్షల రూపాయలు చేతులు మారుతున్నా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జి.హెచ్.ఎం.సి., రెవెన్యూ శాఖల అధికారులు పలు ఫిర్యాదులు అందుకున్నప్ప టికీ క్షేత్రస్థాయిలో తనిఖీలు జరగకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శేర్లిం గంపల్లి మండల ఎమ్మార్వో స్పందన లేకపోవడం అనేకానేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు.

గోడ కూలి దంపతులకు గాయాలు :
ఇటీవల కేశవనగర్ లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనం గోడ కూలి పక్కనే నివసిస్తున్న దంపతులకు గాయాలయ్యాయి. ఇంటిపై గోడ పడటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. నాసిరకం నిర్మాణాలతో, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా 8, 9 అంతస్తులు నిర్మిస్తున్నా శేర్లింగంపల్లి ఎమ్మార్వో గాని, శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


తక్షణ చర్యలకు డిమాండ్ : :
కేశవనగర్ తో పాటు ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై రాజేందర్ నగర్ ఆర్డీవో, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంయుక్తంగా తక్షణ విచారణ చేపట్టి, నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు సహకరించిన అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
