Friday, April 24, 2026
Homeహైదరాబాద్‌Dalit Christians | దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలి.

Dalit Christians | దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలి.

దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా కొనసాగింపు అంశంపై సుప్రీంకోర్టు సమగ్ర పునఃపరిశీలన చేపట్టాలని దళిత క్రిస్టియన్ జేఏసి నేత జెరూషలేం మత్తయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎస్సీ హోదాపై వెలువడుతున్న న్యాయపరమైన అభిప్రాయాలు దళిత క్రైస్తవుల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడంలో విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, వివక్ష రహిత జీవనం, మత స్వేచ్ఛ వంటి హక్కులను కల్పిస్తోందని గుర్తుచేసిన ఆయన, మత మార్పిడి జరిగినంత మాత్రాన చారిత్రకంగా వెనుకబడిన వర్గాల పరిస్థితులు ఒక్కసారిగా మారవని అన్నారు. కేవలం మత మార్పిడి ఆధారంగా హోదాలను తొలగించడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. అందువల్ల వారి హక్కుల పరిరక్షణ కోసం సమగ్ర విధానాలు అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవుల వాస్తవ పరిస్థితులను అంచనా వేయడానికి స్వతంత్ర, పారదర్శక సర్వే నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. దేశంలో కుల వ్యవస్థ ఇంకా బలంగా కొనసాగుతోందని, మత మార్పిడి జరిగినప్పటికీ దళితులు ఎదుర్కొనే వివక్ష అంతరించి పోవడం లేదని ఆయన అన్నారు. కాబట్టి దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించే అంశాన్ని రాజ్యాంగ, చట్టపరమైన కోణంలో సమగ్రంగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర మంత్రివర్గంలో, అధికార పార్టీలో ఉన్న దళిత క్రైస్తవులు ఈ అంశంపై స్పందించకపోవడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ జన్ను యీర్మియా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ దార్ల. అశోక్ దైవచిత్తం, గడ్డం. అశోక్ ఓయూ జేఏసీ చైర్మన్, దళిత క్రిస్టియన్ ప్రెంట్ వ్యవస్థాపకులు, అశోక్ కందిగ జాతీయ సలహాదారులు, కొడవటి రవి ఉమ్మడి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News