దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (BPL) పేదలు అనారోగ్యం బారిన పడితే ప్రభుత్వం ఆదుకుంటోంది. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF), లెటర్ ఆఫ్ క్రెడిట్(LOC) ద్వారా చేయూతనిస్తోంది. అయితే.. ఈ సహాయాన్ని ఎలా పొందాలో చాలా మందికి తెలియదు. కాబట్టి వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో (Corporate Hospitals) కొన్ని రోగాలకు ఆరోగ్యశ్రీ పథకం (Arogyashri Scheme) కింద రూ.10 లక్షల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తారు. తెల్ల రేషన్ కార్డు (White Ration Card) ఉన్నవాళ్లు దీనికి అర్హులు.
ఆరోగ్యశ్రీ పరిధిలో లేని రోగాలకు LOC ఇస్తారు. ఎల్వోసీ అంటే ప్రభుత్వం నుంచి ఆసుపత్రికి ఇచ్చే హామీ పత్రం. ఇది ఉంటే రోగి నుంచి డబ్బు తీసుకోకుండా చికిత్స అందిస్తారు. రోగం నిర్థారణ అయ్యాక చికిత్సకు అయ్యే అంచనా వ్యయాన్ని(Estimation Bill రూపంలో) ఆసుపత్రివాళ్లు ఇస్తారు. అనంతరం.. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ/ఎంపీలను కలిసి వారి నుంచి సిఫారసు లెటర్ తీసుకొని, దానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు జతపరిచి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని(CMO) సంప్రదిస్తే ఎల్వోసీ జారీ చేస్తారు. దాన్ని ఆసుపత్రిలో ఇచ్చిన వెంటనే చికిత్స ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి సాయం పొందాలంటే.. ముందుగా.. ఆసుపత్రిలో డబ్బు చెల్లించి వైద్యం పొందిన తర్వాత సంబంధిత బిల్లులు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ను దరఖాస్తుకు జతచేసి సీఎంఆర్ఎఫ్ ఆఫీసులో/ఆన్లైన్లో ఇస్తే చెక్లు జారీ చేస్తారు. వాటిని మన అకౌంట్ ఉన్న బ్యాంక్లో ఇస్తే ఖాతాలో డబ్బులు వేస్తారు. ఈ పథకం వల్ల పేద, బడుగు, బలహీనవర్గాల వారు ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు.
- డాక్టర్ పోలం సైదులు
