- లోహాలపై అమ్మకాల ఒత్తిడి..
- అమెరికా సైన్యం దాడులు జరపడమే కారణం..
ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పతనమయ్యాయి. ఇరాన్ పై అమెరికా సైన్యం తాజాగా దాడులు జరపడంతో సురక్షిత పెట్టుబడులుగా భావించే ఈ లోహాలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ఫ్యూచర్స్ సుమారు రూ.1,000 వరకు పడిపోయాయి. ఇక వెండి ఫ్యూచర్స్లో కూడా దాదాపు 2 శాతం మేర క్షీణత కనిపించింది.
మంగళవారం ఉదయం 10:25 గంటల సమయంలో ఎంసీఎక్స్లో జూన్ 5 గోల్డ్ ఫ్యూచర్స్ 0.61% నష్టంతో రూ.971 తగ్గి రూ.1,58,110 వద్ద ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో రూ.1,58,000 కనిష్ఠ స్థాయిని తాకింది. మరోవైపు జూలై 3 సిల్వర్ ఫ్యూచర్స్ కూడా అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఇంట్రాడేలో సుమారు 2% నష్టంతో రూ.5,000 కంటే ఎక్కువగా పతనమై రూ.2,71,972 కనిష్ఠాన్ని నమోదు చేసింది.
కాగా, దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రదేశాలు, పడవలపై అమెరికా సైన్యం దాడులు జరపడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చర్చల కోసం ఇరాన్ తమ ప్రతినిధులను దోహాకు పంపిన సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. అయితే అమెరికా దీనిని ‘ఆత్మరక్షణ’ చర్యగా పేర్కొన్నది. ఇదిలావుంటే ఈ భౌగోళిక ఉద్రిక్తతల కారణంగానే బులియన్ మార్కెట్లో ధరలు ప్రభావితమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
