Wednesday, February 11, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంIllegal | కుంటలో కట్టడాలు..

Illegal | కుంటలో కట్టడాలు..

  • నీటి వనరుల భూమిలో 76 చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లు!
  • కీసర మండలం గోదుమకుంటలో భారీ భూ అక్రమాలు..
  • సర్వే నం.101లో విలువైన 5 ఎకరాల చెరువు భూమి కబ్జా..
  • హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో వాటర్ బాడీలో భూ దందా
  • అక్రమార్కులకు అండగా నిలిచిన సబ్ రిజిస్ట్రార్లు..
  • నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు
  • ఇల్లీగల్ లేఅవుట్కు గ్రామ కార్యదర్శి అనుమతులు
  • భూ అక్రమార్కులపై తక్షణ చర్యలకై డిమాండ్

చట్టాన్ని తుంగలో తొక్కి, ప్రజాధనాన్ని, ప్రభుత్వ వనరులను దోచుకోవడానికి కొందరు అధికారులు, భూ అక్రమార్కులు కలిసి చేస్తున్న ‘మహా కుమ్మక్కు’ మేడ్చల్ మల్కాజిరి జిల్లా(medchal malkajgiri district), కీసర మండలం(Keesara Mandal), గోదుమకుంట గ్రామం(Godumakunta Village), సర్వే నం.101లో((Survey No.101)) బట్టబయలైంది. ఏకంగా నీటి వనరుల పరిధిగా హెచ్ఎండీఏ(HMDA) మాస్టర్ ప్లాన్లో స్పష్టంగా ఉన్న సుమారు 5 ఎకరాల(5 acres) అత్యంత విలువైన భూమిని చట్టవిరుద్దంగా లేఅవుట్గా మార్చి, నకిలీ పత్రాలతో(Fake Documents) ఏకంగా 76 రిజిస్ట్రేషన్ల దందా సాగించడం ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని హరించివేసే తీవ్రమైన నేరం.

కీసర ఎస్ఆర్ఓ కార్యాలయం

నీటి వనరుల కబ్జా.. ప్రకృతిపై అక్రమార్కుల దాడి!

- Advertisement -

గోదుమకుంట సర్వే నం.101 భూమి హెచ్ఎండిఏ ల్యాండ్ యూజ్ లెటర్ (30.059338/LU/P5/HMDA/01022023) ప్రకారం మేజర్ పార్ట్ వాటర్ బాడీ, మైనర్ పార్ట్ ఓపెన్ స్పేస్ గా నిర్దేశించబడింది. అంటే, ఈ ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పెట్టడానికి, ఒక్క ప్లాట్ను కూడా సృష్టించడానికి వీల్లేదు. కానీ, ప్రకృతి వనరులను, పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన కనీస బాధ్యతను అధికారులు విస్మరించారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. నగరం మున్సిపాలిటీ లేఖ (తేదీ 17.10.2025) ఈ సర్వే నం.101లో ఎలాంటి ఎస్ఆర్ఎస్ లేదా బిల్డింగ్ అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసినప్పటికీ, ఈ దందా నిర్విరామంగా, యథేచ్ఛగా కొనసాగింది.

అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్

గ్రామ కార్యదర్శిపై తీవ్ర విమర్శలు, అధికారం దుర్వినియోగం!

ఈ కుంభకోణంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పాత్ర అత్యంత హేయమైనది. హెచ్ఎండిఏ అనుమతులు లేకుండానే, ‘క్రియేట్ చేసిన’ ఇల్లీగల్ గ్రామ పంచాయితీ లేఅవుట్ ఆధారంగా కార్యదర్శి ఏకంగా 76 ఇళ్ల నిర్మాణ అనుమతులను చట్టవిరుద్ధంగా మంజూరు చేశారు. వ్యక్తిగత లాభాల కోసం, పదవిని దుర్వినియోగం చేసి, ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు, ప్రజాద్రోహం! ఈ మహా కుంభకోణంలో అత్యంత ఘాటైన విమర్శలు ఎదుర్కొంటున్నది సబ్-రిజిస్ట్రార్ కార్యాలయమే. మొత్తం 76 చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లు జరిగాయంటే, దీని వెనుక సబ్-రిజిస్ట్రార్ల దుశ్చర్య, అవినీతి ఎంతమేరకు ఉందో స్పష్టమవుతోంది. “నకిలీ ఎల్ఆర్ఎస్-2020 అప్లికేషన్ నంబర్లను ఉదా: (M/NAGA/015952/2020) వాడుతూ రిజిస్ట్రేషన్లు జరిపారంటే, సబ్-రిజిస్ట్రార్ల దృష్టికి ఈ మోసం రాకుండా పోయిందా? లేక, వారి కనుసన్నల్లోనే ఈ దందా నడిచిందా?”

అన్నది లక్షలాది మంది ప్రజల ప్రశ్న. కీసర ఎస్ఆర్డీ (కోడ్:1530) బి. సందీప్ కుమార్ 2025 సంవత్సరంలో సుమారు 30 రిజిస్ట్రేషన్లు నకిలీ ఎస్ఆర్ఎస్, జీపీ అనుమతుల ఆధారంగా చేయడం చట్టాన్ని పట్టపగలే హత్య చేయడమే. చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్లు చేసే ముందు, డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయో, లేవో సరిచూడాల్సిన బాధ్యత ఆయనపై ఉందా, లేదా? ఈ రిజిస్ట్రేషన్లు ఆపకుండా, అనుమతించడంలో ఉద్దేశ పూర్వక చర్య, వ్యక్తిగత లాభాల కోణం స్పష్టంగా కనబడుతోంది.

ఇక, మిగతా 46 రిజిస్ట్రేషన్లు 2024 సంవత్సరంలో అప్పటి మునుపటి ఎస్ఆర్ హయాంలో జరిపించబడ్డాయి. రెండు వేర్వేరు సంవత్సరాల్లో, ఇద్దరు వేర్వేరు సబ్-రిజిస్ట్రార్ల పాలనలో ఈ భారీ అక్రమాలు జరిగాయంటే, ఇది వ్యవస్థాగత అవినీతి అని తేటతెల్లమవుతోంది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు భూ అక్రమార్కులకు అడ్డాలుగా, నకిలీ పత్రాల రిజిస్ట్రేషన్లకు వేదికగా మారాయనడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? రిజిస్ట్రేషన్ల శాఖలో పాతుకుపోయిన ఈ ‘రిజిస్ట్రేషన్ల మాఫియా’ను పెకిలిం చకపోతే, సామాన్య ప్రజల ఆస్తులకు రక్షణ కరువవుతుంది.

ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి!

గోదుమకుంట సర్వే నం.101లో జరిగిన ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రిజిస్ట్రేషన్ చట్టం, హెచ్ఎండీఏ నిబంధనలు, ప్రభుత్వ – ఉత్తర్వులకు పూర్తిగా విరుద్ధం. అధికారులు, భూ అక్రమార్కుల కుమ్మక్కు ఫలితంగా అమా యక ప్రజలు మోసపోయి, చట్టవిరుద్ధమైన ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ అవినీతి కుంభకోణంపై ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి, ఇందులో పాలుపంచు కున్న గ్రామ కార్యదర్శి, అప్పటి, ఇప్పటి సబ్-రిజిస్ట్రార్లు మరియు డెవలపర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి! అక్రమ రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేసి, చట్టవిరుద్ధమైన లేఅవుట్ను పూర్వస్థితికి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News