EPDC అధ్యక్షుడు రంగయ్య హెచ్చరిక
హైదరాబాద్: కలర్ హెయిర్ డైల వల్ల పర్యావరణానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ (Environment Protection Development Council-EPDC) అధ్యక్షుడు ఎస్.సి.హెచ్. రంగయ్య హెచ్చరించారు. హెయిర్ డై ప్యాకెట్లలో వినియోగదారులకు ఇస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గ్లౌజులు డేంజర్ అని చెప్పారు. ఈ గ్లౌజులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ మైక్రాన్ల మందంతో తయారుచేస్తున్నారని ఆరోపించారు. తక్కువ మందం కారణంగా ఈ ప్లాస్టిక్ మరింత త్వరగా చిన్న ముక్కలుగా విడిపోయి భూమిలో కలిసిపోకుండా పర్యావరణంలో పేరుకుపోతుందని తెలిపారు. ఈ గ్లౌజులు కేవలం ఒక్కసారి ఉపయోగించి పారవేసేవి కావడంతో వీటి వినియోగం భారీగా ఉందని చెప్పారు.
ఈ అతి తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్ (Plastic) భూమి, నీరు, వాయు కాలుష్యానికి దారితీసి జీవరాశుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణ నియమాలను ఉల్లంఘిస్తూ తయారుచేస్తున్న ఈ ప్లాస్టిక్ గ్లౌజుల తయారీ, పంపిణీపై ప్రభుత్వం (Government) తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ తీవ్రమైన పర్యావరణ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిబంధనలను కఠినతరం చేసి పర్యవేక్షణను పెంచాలని డిమాండ్ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిబంధనలను అతిక్రమించి, అతి తక్కువ మైక్రాన్ల మందంతో గ్లౌజులు తయారు చేస్తున్న కంపెనీలపై భారీ జరిమానాలు విధించాలని లేదా ఉత్పత్తిని నిలిపివేయాలని సూచించారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. రంగుల డై ప్యాకెట్లలో ప్లాస్టిక్కు బదులుగా బయోడిగ్రేడబుల్ (Biodegradable) లేదా పర్యావరణహితకరమైన ప్రత్యామ్నాయ వస్తువులతో తయారు చేసిన గ్లౌజులను తప్పనిసరి చేయాలి. వినియోగదారులు, తయారీదారుల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుచేయాలి. ఆయా కంపెనీలు స్వచ్ఛందంగా ఆ గ్లౌజ్ స్థానంలో బయో డిగ్రేడబుల్ కవర్స్ వినియోగదారులకు అందించాలని, లేకుంటే న్యాయస్థాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
