Saturday, May 30, 2026
HomeతెలంగాణProtest | పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి..

Protest | పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి..

  • ఎస్ ఐ ఆర్. ను రద్దు చేయాలి..
  • నాలుగు లేబర్ కోడ్లు ఉపసంహరించాలి..
  • డిమాండ్ చేసిన సి.పీ.ఐ.ఎం.ఎల్. మాస్ లైన్..

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, ఓటు హక్కును హరించే ఎస్ ఐ ఆర్. ను రద్దు చేయాలని, యాజమాన్యానికి అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సి.పీ.ఐ.(ఎం.ఎల్.) మాస్ లైన్ కేంద్ర కమిటీ ఇచ్చిన దేశవ్యాప్త నిరసనల పిలుపులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పార్టీ ఆధ్వర్యంలో కొంపల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించటం జరిగింది.

ఈ సందర్భంగా సి.పీ.ఐ. ( ఎం.ఎల్. ) మాస్ లైన్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఎం. హన్మేశ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులు విధించడం వల్లే ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.

- Advertisement -

ఎన్నికల సమయంలో ధరలు పెరగవని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల అనంతరం మళ్లీ పెంపులు ప్రారంభించారని ఆరోపించారు. ఇటీవల పెట్రోల్, డీజిల్, కమర్షియల్ గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెరగడంతో చిన్న వ్యాపారులు, ఆటో కార్మికులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్యాస్ ధరల పెరుగుదల కారణంగా హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగాయని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై విధిస్తున్న పన్నులను తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాస్ లైన్ గ్రేటర్ నాయకుడు వి ప్రవీణ్ అధ్యక్షత వహించగా, సీపీఐ (ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు గడ్డం సదానందం, పీ ఓ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు డి. స్వరూప, పీ ఓ డబ్ల్యు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షురాలు లక్ష్మీబాయి, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు వెంకటేష్, తదితరులు పాల్గొని ప్రసంగించారు. వక్తలు మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఎల్.పీ.జీ. గ్యాస్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కార్మికుల జీవనం రోజురోజుకూ దుర్భరమవుతోందని తెలిపారు.

కనీస వేతనం రూ.26,000 ఉండాల్సిన పరిస్థితిలో రూ.10,000 – 15,000 వేతనాలతో జీవనం సాగించడం కష్టంగా మారిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి, సంక్షేమ పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాలను కోరారు. అలాగే యుద్ధాలు, ప్రజలపై మోపుతున్న ఆర్థిక భారాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించే వరకు, ఎస్.ఐ.ఆర్. ను రద్దు చేసే వరకు, నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News