- ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు..
- వెల్లడించిన ఏపీ రవాణాశాఖ మంత్రి..
ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ కాబోతోందంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నిరసనలు చేపట్టింది. ఈ నిరసనల్లో వైసీపీ కూడా పాల్గొంది. మరోవైపు, ఈ ప్రచారంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఆర్థికంగా నిలకడగా ఉందని, సంస్థకు రూ. 30 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా, ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలను పెంచే ఉద్దేశం కూడా లేదని ప్రయాణికులకు తీపి కబురు చెప్పారు.
సంస్థను మరింత ఆధునికీకరించేందుకు త్వరలోనే కొత్తగా 2,500 ఎలక్ట్రిక్, 500 సీఎన్జీ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, కార్మికుల సమస్యలన్నింటినీ రెండేళ్లుగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న అవసరమైన ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.
