Wednesday, September 10, 2025
ePaper
spot_img
Homeఆదాబ్ ప్రత్యేకంజీహెచ్ఎంసీలో వీధి కుక్కల బెడద.. మరో ప్రక్క అవినీతి ఆగ‌డాలు..

జీహెచ్ఎంసీలో వీధి కుక్కల బెడద.. మరో ప్రక్క అవినీతి ఆగ‌డాలు..

  • ప్రాణాంతకంగా మారుతున్న కుక్కల దాడులు
  • జీహెచ్‌ఎంసీలో వీధి కుక్కల నియంత్రణ నిధులలో అవినీతి !
  • జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం భారీ బోగ‌స్ బిల్లులు
  • ఆపరేషన్ల కోసం లక్షలు ఖర్చు చేస్తున్న ప్ర‌భుత్వం
  • కుక్క‌ల నియంత్ర‌ణ నిధులు స్వాహా చేస్తున్న అధికారులు
  • ప్రజాధనం దుర్వినియోగంపై ప్ర‌జ‌ల ఆందోళన
  • ఆడిట్ అధికారుల నిర్ల‌క్ష్య‌మా.. లోప‌కాయారి ఒప్పంద‌మా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత కొంతకాలంగా వీధి కుక్కల బెడద తీవ్ర సమస్యగా మారింది. వీధి కుక్కల దాడుల్లో అమాయకులు, ముఖ్యంగా చిన్న పిల్లలు గాయపడటం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ సమస్యను నియంత్రించడానికి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) వీధి కుక్కల సంతాన నియంత్రణ (Animal Birth Control) ఆపరేషన్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. తాజాగా, ఈ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ప్రమాదకరమైన వీధి కుక్కల బెడద
గతంలో హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఒక విషాద సంఘటన జరిగింది. నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటన తర్వాత, జీహెచ్‌ఎంసీ వీధి కుక్కల నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇంకా లభించలేదు. కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వంటి వ్యాధులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

అవినీతి ఆరోపణల వెనుక వాస్తవాలు
వీధి కుక్కల నియంత్రణ కోసం జీహెచ్‌ఎంసీ ఖర్చు చేస్తున్న నిధులలో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు బయటపడ్డాయి. సామాజిక కార్యకర్తలు చేసిన ఆరోపణల ప్రకారం, వీధి కుక్కలకు ఆపరేషన్లు మరియు మందుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా కోరిన వివరాలను జీహెచ్‌ఎంసీ  వెటర్నరీ విభాగం అధికారులు ఇవ్వడానికి జాప్యం చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. కుక్కలకు వాడిన మందులు, ఆపరేషన్ల వివరాలు, బిల్లులు, ఏజెన్సీల వివరాలను కోరినా అధికారులు స్పందించకపోవడం వెనుక ఏదో రహస్యం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్ మరియు ఆరు జోన్లకు సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి (ఎల్‌బీ న‌గ‌ర్‌, చార్మినార్ జోన్‌), డేవిడ్ విల్స‌న్ (శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి జోన్‌), చ‌క్ర‌పాణి రెడ్డి (సికింద్రాబాద్‌, ఖైర‌తాబాద్‌) కావాలనే సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వారిపై వస్తున్నాయి.

బోగస్ బిల్లుల సృష్టి
అందిన సమాచారం ప్రకారం, కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు చేయకపోయినా లేదా తక్కువ మందులు వాడినా, బోగస్ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు కాజేశారని తెలుస్తోంది. ఒకవైపు ప్రజలు వీధి కుక్కల దాడులతో భయాందోళనలు చెందుతుంటే, మరోవైపు ప్రజల పన్నులతో కూడిన నిధులను అధికారులు ఇలా దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతోంది.

ప్రజల డిమాండ్లు
ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని, ఇలాంటి అవినీతి భవిష్యత్తులో జరగకుండా పారదర్శకమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News