- ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్
- విబ్సన్ ఫార్మా ఆధ్వర్యంలో 3 లక్షల సి.సి. కెమెరాలు ప్రారంభం
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లలితా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సి.సి. కెమెరాలను సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ శనివారం ప్రారంభించారు.విబ్సన్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ సుంకు రామచందర్ తన సొంత నిధులతో దాదాపు రూ.3 లక్షల వ్యయంతో కాలనీలో సి.సి. కెమెరాలను ఏర్పాటు చేశారు.
కాలనీ వాసుల అభ్యర్థన మేరకు,ఎమ్మెల్యే సూచనలతో ప్రజోపయోగార్ధం ఈ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మాట్లాడుతూ,ప్రజల భద్రతకు మరియు శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కాలనీల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
తన సొంత ఖర్చుతో కాలనీకి సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసిన సుంకు రామచందర్ను ఎమ్మెల్యే అభినందించారు.కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మధుసూదన్ రావు,నేతలు నరేందర్, రత్నశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
