- మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై చర్చ..
- కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టపై ప్రభావం..
తెలంగాణ రాజకీయాల్లో వరుస పరిణామాల వేళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అత్యవసరంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, వాటి తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
కొన్ని రోజులుగా వివాదాస్పద అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠపై చూపుతున్న ప్రభావంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
కొండా సురేఖ అంశంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమాలోచనలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పలకాలి? పార్టీపై ప్రభావం పడకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో పాలనాపరమైన అంశాలు, వివిధ శాఖల పనితీరుపైనా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భేటీకి ప్రాధాన్యం ఏర్పడటంతో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
