బాలాజీ నగర్లో రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో మీడియా ఔట్రీచ్ డేలో భాగంగా అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ – 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో కొనసాగింది.
ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యత, బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లు, వేగ నియంత్రణ, హెల్మెట్ ధరింపు, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలు, కుటుంబాలపై పడే ప్రభావాన్ని వివరించి ప్రమాదాల తగ్గింపే లక్ష్యంగా ప్రతి ప్రయాణికుడు తన బాధ్యతను గుర్తించాలని సూచించారు.
కార్యక్రమంలో జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ ఎస్ సదయ్య, ఎస్ఐపీ శ్రీరాములు, ఎస్ఐపీ శ్రీలక్ష్మయ్య, ఎస్ఐపీ బి వేణుమాధవ్, ఎస్ఐపీ మౌనిక, పాత్రో మొబైల్–2 సిబ్బంది, పీసీలు, ట్రాఫిక్ పీఎస్లోని పీసీలు పాల్గొన్నారు. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై రోడ్డు భద్రతపై సందేహాలు నివృత్తి చేసుకున్నారు.
ట్రాఫిక్ నియమాలు పాటించడం ఒక్క రోజు కార్యక్రమంతో ముగియకూడదని, ఇది నిత్యజీవితంలో భాగంగా మారాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ప్రయాణిస్తే ప్రమాదాలు తగ్గుతాయని, అందరికీ సురక్షితమైన రోడ్డు మార్గం సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు.
