- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
విద్యార్థులు చిన్ననాటి నుంచి కొత్త ఆలోచనలపై దృష్టి సారించి సాంకేతిక రంగంలో ఎదగాలని విద్యార్థులకు సూచించారు. శుక్రవారం వనపర్తి మండలం చిట్యాల లో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025 – 26, ఇన్స్పైర్ అవార్డ్స్ 2024 – 25 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజురోజుకు సాంకేతికపరంగా అనేక మార్పులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా విద్యార్థులు సైన్స్ ను అందిపుచ్చుకొని కొత్త ఆలోచనకు పదును పెట్టాలని సూచించారు.

సమాజంలోని సమస్యల పరిష్కారానికి మార్గం సైన్స్ చూపిస్తుందని అది సృజనాత్మకత ఆలోచనలతోనే సాధ్యమవుతుందని అన్నారు. సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతుందని ఈ నేపథ్యంలో కొత్త ఆవిష్కరణల ద్వారా ప్రతి రంగం అభివృద్ధి అంచలంచెలుగా జరుగుతుందన్నారు. ప్రపంచం ఆధునిక సాంకేతికత వైపు పరిగెడుతుందని విద్యార్థులు సైన్స్ లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకోవాలని తెలిపారు. సైన్స్ అంటేనే నిజం అని సైన్స్ ద్వారా ప్రపంచంలో ప్రకృతిలో దాగి ఉన్న నిజాలను తెలుసుకోవచ్చని అన్నారు.

సైన్సును అలవర్చుకుంటే జీవితంలో ముందుకు వెళ్లగలమని, ఇక్కడి నుండి ఇతర గ్రహాల పైన డ్రోన్ల ఆపరేట్ చేయగలుగుతున్నామని, అంతగా సాంకేతికత అభివృద్ధి చెందిందని తెలిపారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్స్ ను పరిశీలించి వాటికి సంబంధించి ప్రశ్నలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి 150 పాఠశాలల నుండి విద్యార్థులు హాజరవుతారని మొత్తం 270 వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రదర్శించనున్నారని తెలిపారు.
అంతకుముందు కలెక్టర్ ప్రత్యేక చొరవతో విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్ పెంచడం కోసం సైన్స్ ఉపాధ్యాయుల ద్వారా ప్రత్యేకంగా పుస్తకాన్ని రూపొందించారు ఈ సందర్భంగా ఆ పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనలను కలెక్టర్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, తాసిల్దార్ రమేష్ రెడ్డి, జి సి డి ఓ సుబ్బలక్ష్మి, మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్ ప్రశాంతి, ఇతర విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
