- పుస్తెమెట్టెలు స్వర్ణకారులే విక్రయించే ఫైల్ పైనే మొదటి సంతకం..
- విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత..
తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రజలు ఆదరిస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపే నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) హామీ ఇచ్చారు. పుస్తెలు, మెట్టెలు స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మే ఫైల్ పై మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ఉప్పల్ భాగాయత్ లో నిర్వహించిన విశ్వకర్మ జయంతిలో పాల్గొని మాట్లాడారు. విశ్వకర్మల్లోని ఐదు దాయిలైన మను, మయ, త్వష్ట, విశ్వజ్ఞ, శిల్పిల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరముందని అన్నారు.
విశ్వకర్మల్లోని ఐదు దాయిల పరిస్థితి మారాల్సిన అవసరముందని చెప్పారు. ఆ వృత్తుల్లో ఉండే కష్టాన్ని దగ్గరుండి చూశానని.. ఎన్నోసార్లు చట్ట సభల్లో ఈ అంశాలపై మాట్లాడానని గుర్తు చేశారు. కమర్షియల్ గోల్డ్ షాప్ లు వచ్చిన తర్వాత స్వర్ణకారుల జీవితాలు ఆగమయ్యాయని సైనేడ్ తిని సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్రంగులకు ఇన్సూరెన్స్, శిల్పులకు దేవాలయాల కమిటీల్లో స్థానం కల్పించాల్సిన అవరముందని అన్నారు. విశ్వకర్మలకు భూములు ఉండవని భూములు లేని వర్గాలకు భూమి పంపిణీ చేయాలన్న మంచి ఉద్దేశంతో భూలక్ష్మీ పథకాన్ని రూపొందించామని అన్నారు.
భూలక్ష్మీ పథకానికి స్ఫూర్తి మారోజు వీరన్న, ప్రొఫెసర్ జయశంకర్ సార్, శ్రీకాంతా చారిలేనని చెప్పారు. జయశంకర్ సార్ తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారని ఆయన ఫోటో లేకుండా తమ పార్టీ కార్యక్రమం ఏదీ జరగదని చెప్పారు. విశ్వకర్మల కష్టం తెలిసిన బిడ్డనని తన పార్టీకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాలు పట్టించుకోక పోయినా సరే 40 ఏళ్లుగా విశ్వకర్మ జయంతిని ఘనంగా కుల పెద్దలు నిర్వహిస్తుండడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
