విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసనసభ విధులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు రాయినిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుండు రామాంజి గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్ తదితర పాత్రలను పోషిస్తూ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడం, వాటిపై చర్చించడం, ప్రశ్నలు అడగడం, సమాధానాలు ఇవ్వడం వంటి అంశాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ప్రదర్శించారు.
మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, మాట్లాడే నైపుణ్యం, సమయస్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యత పెంపొందుతాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తూ భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జానకిరెడ్డి, బుర్ర వెంకటేశ్వర్లు, నరసింహారావు, పీఈటీ ప్రదీప్, కల్పన, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.
