- వ్యవసాయ శాఖ అధికారి మాధవరెడ్డి
ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి పంటలను సాగు చేసిన రైతులకు మాత్రమే క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేయనున్నట్లు మేడ్చల్ మండల వ్యవసాయ శాఖ అధికారి మాధవరెడ్డి తెలిపారు. బోనస్ పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గుర్తించిన సన్న రకాలలో బిపిటి 5204, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 7715, ఆర్ఎన్ఆర్ 15048, డబ్ల్యూజీఎల్ 44 ఉన్నాయి. విత్తన డీలర్ల వద్ద ఈ రకాల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సంబంధిత డీలర్ షాపులోనే ఆన్లైన్ నమోదు చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా సీడ్ ప్లాంట్స్, యూనివర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సంబంధిత పత్రాల జిరాక్స్ ప్రతులను సమర్పించాలి. సొంత విత్తనాలను వినియోగించి సన్న రకాల వరి సాగు చేసిన రైతులు స్వీయ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత ఏఈఓకు అందజేయాలని అధికారులు తెలిపారు. బోనస్ పొందాలంటే ఆన్లైన్ నమోదు తప్పనిసరి అని, అర్హులైన మేడ్చల్ మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.
