HomeUncategorizedDakshinayana | ఉపాసన, ఉపవాసాలకు ఉద్దిష్ట మైనది దక్షిణాయణం

Dakshinayana | ఉపాసన, ఉపవాసాలకు ఉద్దిష్ట మైనది దక్షిణాయణం

మన పూర్వికులు సూర్య భగవానుని గమనం ప్రకారం యుగాలుగానూ, యుగాలను సంవత్సరములుగానూ, సంవత్సరములను మాసములు గానూ, మాసములను వారములు గానూ, వారములను రోజులు గానూ, రోజులను జాములు గానూ, జాములను ఘడియలు గానూ కాల గమనాన్ని తెలుసు కోవటానికి విభజించారు. సంవత్సరంలో ఉన్న 12 మాసములను రెండు ఆయనాలుగా విభజించారు. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ఏర్పడతాయి.

ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణం, జూలై 17 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు. సాయన ఉత్తరాయణం ప్రతి సంవత్సరం డిశంబర్ 21-22 తేదీల్లో ప్రారంభం అవుతుంది. అలాగే సాయన దక్షిణాయణం జూన్ 21-22 తేదీల్లో ప్రారంభం అవుతుంది. అయితే భారతీయ గ్రహగణితం నిర్ణయ గణితం కాబట్టి ఆయనాంశ కారణంగా సాయన, నిర్ణయ సంక్రాంతుల్లో ఇలా మార్పు కననిపిస్తుంది.

- Advertisement -
Dakshinayana Significance and Spiritual Importance1

ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. ‘అయనం’ అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. కానీ సూర్యోదయాన్ని గమనిస్తే, అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21, సెప్టెంబరు 23. మిగతా ఆరు నెలలు ఈశాన్యానికి దగ్గరగా, మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది.

సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. సూర్య గమణాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు . భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. ఏడాదిలో 6నెలలు ఉత్తరాయణం..

Dakshinayana Significance and Spiritual Importance11

6నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి నప్పుడు ఉత్తరాయణం.. కర్కాటక రాశిలోకి ప్రవేశించి నప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. ఆ సమయంలో స్నాన, దాన, జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి.

ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడనికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది. శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు. శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది.

ఫలితంగా జీవులలో రోగ నిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపసాన, తరుచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు చేయడం, సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి. ముఖ్యంగా దక్షిణాయనం లోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు, విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు.

ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే, వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రాద్ధాదులు నిర్వహించక పోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి, ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం.

అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య. ధ్యానం, మంత్ర జపాలు, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు, సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, అవసరంలో ఉన్న వారికి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయని, పాపాలు తొలగి పోతాయని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఈ ఏడు జూలై 16న దక్షిణాయనం ప్రారంభం అయింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News