Wednesday, June 24, 2026
Homeనల్లగొండTragedy | విద్యుత్ షాక్‌తో లైన్మన్ దుర్మరణం

Tragedy | విద్యుత్ షాక్‌తో లైన్మన్ దుర్మరణం

  • ట్రాన్స్‌ఫార్మర్ వద్ద లైన్ తనిఖీ చేస్తుండగా విషాదం
  • స్తంభం పై నుంచి కిందపడడంతో ఘటనాస్థలంలోనే మృతి

జనగామ జిల్లా జనగామ మండలం చీటకోడూర్ గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో లైన్మన్‌గా విధులు నిర్వహిస్తున్న రాధమల్ల కరుణాకర్ రెడ్డి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.

గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కరుణాకర్ రెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లారు. లైన్‌ను తనిఖీ చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కిన సమయంలో అనుకోకుండా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. షాక్ తీవ్రతకు స్తంభం పై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

- Advertisement -

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహోద్యోగులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన లైన్మన్ కరుణాకర్ రెడ్డి మృతిపై విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News