- నిబంధనలకు పాతరపై స్పందించని యంత్రాంగం!
- గ్రామ కార్యదర్శి లోపాయికారి ఒప్పందం?
- నోటీసులకే పరిమితమైన ‘ఆసరా’ అక్రమ పింఛన్ల వ్యవహారం!
- జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని మంగాపురం గ్రామస్తుల డిమాండ్
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రేగులగడ్డ తండాలో ప్రభుత్వ ఉన్నతోద్యోగుల తండ్రికి ‘ఆసరా’ వృద్ధాప్య పింఛన్ అందుతున్న అక్రమ ఉదంతంపై ఈ నెల 4వ తేదీన ‘ఆదాబ్ హైదరాబాద’ ప్రచురించిన కథనం తీవ్ర సంచలనం సృష్టించింది. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంటూ, ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతున్న ఇద్దరు కుమా రులు ఉన్నప్పటికీ.. నిరుపేద లకు చెందాల్సిన పింఛన్ సొమ్ము ను కాజేస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయి అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.

నోటీసులకే పరిమితం.. చర్యలు శూన్యం! : ఈ అక్రమ పింఛన్ వ్యవహారంపై ‘ఆదాబ్ హైదరాబాద’ ప్రతినిధి గ్రామ కార్యదర్శి రాధాకృష్ణను వివరణ కోరగా.. తాము మే మొదటి వారంలోనే సదరు లబ్ధిదారునికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఆ నోటీసులో ఏడు రోజుల గడువు విధిస్తూ వివరణ కోరినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ, నోటీసుల గడువు ముగిసి రోజులు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
లోపాయికారి ఒప్పందమేనా? : నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పింఛన్ అర్హత లేదని స్పష్టంగా తెలిసినప్పటికీ, గ్రామ కార్యదర్శి రాధాకృష్ణ తదుపరి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు అక్రమ లబ్ధిదారులతో గ్రామ కార్యదర్శి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని పరో క్షంగా సహకరిస్తున్నారనే ఆరో పణలు బలంగా వినిపిస్తున్నాయి. నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ.. పింఛన్ రద్దు, రికవరీ ప్రక్రియను తొక్కిపెడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

జిల్లా కలెక్టర్ స్పందించాలి! : నిరుపేదల నోళ్లు కొట్టి, ప్రభుత్వ ఖజానాను మోసం చేస్తున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాల్సింది పోయి, అధికారులు చేతులు ముడుచుకు కూర్చోవడంపై మంగాపురం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల డ్రామాలు పక్కనబెట్టి, ఇప్పటివరకు అక్రమంగా పొందిన పింఛన్ సొమ్మును రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వడ్డీతో సహా వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తూ, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న గ్రామకార్యదర్శి రాధాకృష్ణపై ఖమ్మం జిల్లా కలెక్టర్ తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ పింఛన్ను రద్దు చేసి గ్రామంలోని అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
