- డిమాండ్స్ నెరవేర్చకపోతే నిరసనలు..
- హెచ్చరించిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్..
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణకు దిగుతామని ఏపీజేఏసీ అమరావతి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. విజయవాడలో ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 28 జిల్లాల ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యం (డీఏ) బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను అమలు చేయాలని నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ అంశాలపై త్వరగా స్పందించకపోతే ఉద్యమించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం 13 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ సోమవారం (జూన్ 8) నుంచి తన కార్యాచరణను ప్రారంభిస్తుందని వెల్లడించారు.
తమ పోరాటానికి ఇతర ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ఈ కీలక అంశాలపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్తు కార్యాచరణపై సోమవారం మరో ప్రత్యేక సమావేశం జరగనున్నట్లు నాయకులు తెలిపారు.
