- ఐరాస వేదికగా కారుకూతలు కూసిన పాక్..
- ఘాటుగా జవాబిచ్చిన భారత శాశ్వత ప్రతినిధి హరీశ్..
జమ్ముకశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, అది తమ అంతర్గత వ్యవహారమని గట్టిగా స్పష్టం చేసింది. శుక్రవారం ఐరాస సర్వసభ్య సమావేశంలో భద్రతా మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.
పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పి. హరీశ్ తీవ్రంగా స్పందించారు. “జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం భారత్లో అంతర్భాగం, ఎప్పటికీ విడదీయలేనిది. దీనికి విరుద్ధంగా చేసే వాదనలకు చారిత్రక ఆధారాలు లేవు. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార వాదనలు ఈ వాస్తవాన్ని మార్చలేవు” అని ఆయన తేల్చిచెప్పారు. ఐరాస వేదికలను పాకిస్థాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.
మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్-బల్టిస్థాన్లో జూన్ 7న ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుందని స్పష్టం చేసింది. అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే ఈ ఎన్నికల నాటకానికి తెరలేపిందని ఆరోపించింది. ఆక్రమిత ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేసింది. అయితే, గిల్గిట్-బల్టిస్థాన్ ఎన్నికలపై భారత్ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం తోసిపుచ్చింది. భారత్ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది.
