- ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాణి
వాషింగ్టన్ డి.సి. కేంద్రంగా పనిచేస్తున్న యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబిసి), ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాణి నాయకత్వంలోని పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ (పిహెచ్డిసిసిఐ) ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశం అనంతరం యూఎస్ఐబిసి తన అధికారిక సోషల్ మీడియా వేదికలపై ఈ సంభాషణను భారత్–అమెరికా వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేసే ఒక ముఖ్యమైన ముందడుగుగా ప్రస్తావించింది.
యూఎస్ఐబిసి వ్యవసాయ రంగంలో ఇరు దేశాల మధ్య మరింత సహకారానికి మార్గం సుగమం చేశాయని, ఉమ్మడి సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడంతో పాటు కొత్త అవకాశాలను అన్వేషించేందుకు దోహదపడతాయని పేర్కొంది. ఆవిష్కరణల ఆధారిత వ్యవసాయ విధానాలు, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి, ఆహార భద్రత మరియు రైతుల సంక్షేమం వంటి రంగాల్లో భారత్–అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కూడా కౌన్సిల్ నొక్కిచెప్పింది.

అమెరికాలోని ప్రముఖ వ్యాపార, పరిశ్రమల సంస్థలలో ఒకటైన యూఎస్ఐబిసి ఈ సమావేశానికి బహిరంగంగా ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఇది భారత సహకార ఉద్యమానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును, ఇఫ్కో యొక్క ప్రపంచస్థాయి ప్రతిష్ఠను, అలాగే భారత రైతుల ప్రయోజనాలను అంతర్జాతీయ వేదికలపై సమర్థవంతంగా వినిపిస్తున్న దిలీప్ సంఘాణి నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ సమావేశంలో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రైతులకు సాంకేతిక సహాయం అందించడం, ఆవిష్కరణల ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, ఆహార, పోషక భద్రతను బలోపేతం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఇరు దేశాల వ్యవసాయ నిపుణులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ ప్రతినిధులు భారత్–అమెరికా సహకారాన్ని విస్తరించడం ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడి, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని అభిప్రాయపడ్డారు.
భారత్ – అమెరికా వ్యవసాయ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే కీలక అడుగుగా భావించబడుతోంది. అలాగే ప్రపంచ స్థాయిలో సహకార ఆధారిత వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడం, రైతుల ఆదాయం, ఉత్పాదకత మరియు వ్యవసాయ భద్రతను బలోపేతం చేయడం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించబడుతోంది.
