- నగరం నడిబొడ్డులో వెలసిన పాలరాతి మందిరం..
- 50 వసంతాలు పూర్తి చేసుకున్న బిర్లా టెంపుల్..
తెల్లని పాలరాతి మందిరంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుని దర్శనం పాలకడలిలో శేషతల్పంపై శయనించే శ్రీ మహావిష్ణువును తలపిస్తుంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున వెలసిన ఈ బిర్లామందిర్ భాగ్యనగరానికి తలమానికంగా నిలుస్తోంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయం ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకొంటోంది..
హైదరాబాదుకు వచ్చినవారు బిర్లామందిర్ చూడకుండా వెనుతిరిగి వెళ్లరు! నిజానికి ఇది ఒక ఆలయం మాత్రమే కాదు భాగ్యనగర ప్రజల భావోద్వేగం. పగటిపూట చూస్తే పండువెన్నెలను తలపిస్తూ, మూర్తీభవించిన వెన్నెల రాశిలా దర్శనమిచ్చే బిర్లామందిర్ రాత్రి వేళ మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులతో అబ్బురపరుస్తుంది. ఇక్కడ ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు అసలు భాగ్యనగరంలో బిర్లామందిర్ రూపుదిద్దుకోవడం వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం.
ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ప్రసిద్ధి చెందిన హిందుస్థాన్ ఛారిటీ ట్రస్ట్ దేశవ్యాప్తంగా బాలాజీ ఆలయాలు నిర్మించాలనే సత్సంకల్పంతో బిర్లా ఫౌండేషన్ను ఏర్పాటు చేసింది. ఆ విధంగా బిర్లా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాదాపు 35 బాలాజీ ఆలయాలను నిర్మించింది. అత్యంత ప్రతిషాత్మకంగా నిర్మించిన ఈ ఆలయాల్లో మొదటిది దేశ రాజధాని దిల్లీలో ఉంటే, రెండోది మన భాగ్యనగరంలో ఉండడం మన భాగ్యం!
హైదరాబాద్ నగరం నడిబొడ్డున 280 అడుగుల ఎత్తున ఉన్న కాలాపహాడ్ అనే కొండపైన 1966లో బిర్లామందిర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. అచ్చమైన, స్వచ్ఛమైన పాలరాతితో నిర్మించిన బిర్లామందిర్ నిర్మాణంలో సుమారు 2 వేల టన్నుల పాలరాతి వాడారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. పాలరాతికి ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ నుంచి వచ్చిన పాలరాతితోనే మొత్తం ఆలయాన్ని నిర్మించారు.
