- స్థానికులు, నెటిజన్లనుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం..
- అక్కడ ఇల్లు, ఆస్తులు అమ్మేయాలని అల్టిమేటం..
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా లండన్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అత్యంత ఖరీదైన నాటింగ్ హిల్ ప్రాంతంలో వీరు కొనుగోలు చేసిన ఆస్తులు, వాటిలో చేస్తున్న మార్పులపై స్థానిక ప్రజలు, నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళితే, సోనమ్ దంపతులు 2023లో నాటింగ్ హిల్లో 200 ఏళ్ల పురాతన భవనాన్ని సుమారు రూ. 270 కోట్లకు (£21 మిలియన్లు) కొనుగోలు చేశారు. కేవలం బయటి గోడలు మాత్రమే ఉంచి, లోపల పూర్తిగా మార్పులు చేయాలని నిర్ణయించారు. బేస్మెంట్లో స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్ట్ వంటి భారీ నిర్మాణాలకు ప్లాన్ చేశారు. దీనికోసం ఇప్పటికే దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేశారు.
ఇంతటితో ఆగకుండా, ఈ భవనానికి ఆనుకొని ఉన్న హిల్క్రెస్ట్ అనే అపార్ట్మెంట్లో వీరి కుటుంబానికి చెందిన ఓ కంపెనీ సుమారు రూ. 51 కోట్లతో (£4 మిలియన్లు) ఐదు ఫ్లాట్లను, గ్యారేజ్ను కూడా కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్లను తమ భవనంలో పనిచేసే సిబ్బంది నివాసం కోసం (సర్వెంట్స్ క్వార్టర్స్) వాడుకుంటారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొనుగోళ్ల ద్వారా భవన నిర్వహణ కమిటీపై పట్టు సాధించి, తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని వారు భయపడుతున్నారు.
