- ప్రైవేట్ కాలేజీలకంటే అటానమస్ కే డిమాండ్..
- మొదటి విడతలో 25 వేలమంది అటానమస్ కె ఓటు..
మూడేండ్లలో డిగ్రీ విద్యలో అటానమస్ కాలేజీలదే హవా సాగుతున్నది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలతో పోల్చినా అటానమస్ కాలేజీలకే అధిక డిమాండ్ ఉంటున్నది. దోస్త్ అడ్మిషన్లలో ఇదే పునరావృతమైంది. దోస్త్ మొదటి విడత సీట్లను గురువారం కేటాయించగా, 56,147 విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 25 వేల మంది అటానమస్ కాలేజీల్లోనే చేరారు. అంటే 44 శాతం మంది అటానమస్ కాలేజీల్లోనే అడ్మిషన్లు పొందారన్నమాట. ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. అటామనస్ కాలేజీల్లోని సీట్లే నిండుతున్నాయి.
ఇక రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఎక్కువగా చేరుతున్నారు. ప్రస్తుతం 56వేల మంది ప్రవేశాలు పొందితే 54వేల మంది ఇంగ్లిష్ మీడియంలో చేరారు. రాష్ట్రంలోని ప్రముఖ డిగ్రీ కాలేజీల్లో దాదాపు అన్ని అటామనస్ హోదా గలవే. 2004 నుంచి పలు కాలేజీలు అటానమస్ హోదా కలిగి ఉన్నాయి. హైదరాబాద్లోని నిజాం కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట డిగ్రీ కాలేజీ, ఎస్సార్ఆర్(కరీంనగర్), ఎస్సార్బీజీఎన్నార్(ఖమ్మం), ఎన్జీ కాలేజీ(నల్లగొండ), పింగలి కాలేజీ(వరంగల్), గిరిరాజ్(ఖమ్మం) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రముఖ కాలేజీలు కావడం, రెండు దశాబ్దాలుగా అటానమస్ హోదా కలిగి ఉండటంతో ఇవి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ కాలేజీల్లో పీహెచ్డీ ప్రొఫెసర్లు, సకల వసతులుండటమే కాకుండా, వినూత్నమైన కొత్త కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని కాలేజీలైతే 20-25 సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించడమే కాకుండా ఎమర్జింగ్ టెక్నాలజీ, లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మొత్తంగా ఈ కాలేజీలు మెరుగైన విద్య అందిస్తుండటం, ప్లేస్మెంట్స్ ఆశాజనకంగా ఉండటంతో విద్యార్థులు ఈ కాలేజీల బాట పడుతున్నారు.
