- కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి.
యోగ అనేది మనిషిని అత్యంత శక్తిమంతునిగా తయారు చేస్తుందని, నిత్యం యోగ, ధ్యానం చేయడం వల్ల సకల సమస్యలకు పరిష్కారం చూపుతాయని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నందిగామ మండల పరిధిలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం కన్హాశాంతి వనంలో మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా మహోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, ప్రతాప్ రావ్ జాదవ్, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, హార్ట్ఫుల్నెస్ గైడ్ పూజ్య దాజీ మరియు అడిషనల్ కలెక్టర్ కిరణ్మయిలు మొదటగా జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి ఒక్కరు యోగ, ధ్యానాన్ని చేసేందుకు ఖచ్చితంగా ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలన్నారు.యోగ,ధ్యానం చేయడం వల్ల మనిషి తన దినచర్యలో ఎంతో చురుకుగా,హుషారుగా ఉంటారన్నారు.యోగ, ధ్యానం అనేది మనిషిని అత్యంత శక్తివంతంగా మారుస్తుందన్నారు.

అంతకుముందు నిర్వహించిన ఋషి పతంజలి ప్రార్థన మరియు ‘విశ్వ శాంతి ప్రవాహ’ భరతనాట్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘మెగా యోగా ప్రదర్శన’లో సుమారు 6వేల యోగా సాధకులు ‘భుజంగాసనం’ వేశారు.ఈ సందర్భంగా యోగా అభ్యాసకులు సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
ఈ రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అధికారికంగా ధృవీకరించి, నిర్వాహకులకు పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కొటేచా, జాయింట్ సెక్రటరీ మోనాలిసా డాష్,వివిధ దేశాల రాయబారులు వేలాది మంది యోగా సాధకులు,అభ్యాసకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…
