- ఈ పూజ చేస్తే సర్వపాపాలు హరిస్తాయి..
- సకల శుభాలు కలుగుతాయి..
హిందూ సంప్రదాయం ప్రకారం గణపతికి నమస్కరించనిదే ఏ పని ప్రారంభించరు. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు, నోములు, వ్రతాలు వంటి శుభ సందర్భాల్లోనూ, శుభకార్యాల్లోనూ ముందుగా గణపతి పూజ చేయడం సంప్రదాయం. ఇందువల్ల ప్రారంభించబోయే పనుల్లో విఘ్నాలు తొలగుతాయని విశ్వాసం. అయితే పురాణాల ప్రకారం గణపతి స్వరూపాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో సమస్య పరిష్కారానికి ఒక్కో గణపతి స్వరూపాన్ని పూజించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శత్రుజయం, రుణ విముక్తి కలిగించే ఉచ్చిష్ట గణపతి పూజ..
ఉచ్చిష్ట గణపతి స్వరూపం గణేశుని అత్యంత రహస్యమైన, శక్తిమంతమైన తాంత్రిక రూపం. ఈయన గాణాపత్యం సంప్రదాయంలోని ఆరు ప్రధాన శాఖల్లో ఒకటైన ‘ఉచ్చిష్ట గణపత్య శాఖ’కు అధిపతి. భోగభాగ్యాలను, యోగ సిద్ధులను త్వరగా ప్రసాదించే దేవుడిగా, శత్రు జయం, రుణ విముక్తి, కార్యసిద్ధి కోసం ఉచ్చిష్ట గణపతిని విశేషంగా ఆరాధిస్తారు. ఉచ్చిష్ట గణపతి పూజ ఒక శక్తిమంతమైన పూజ! ఇది శత్రు జయం, రుణ విముక్తి, ధన ప్రాప్తి వంటి కోరికలను నెరవేరుస్తుందని విశ్వాసం.
సాధారణంగా బుధవారం ఉచ్చిష్ట గణపతి పూజకు అత్యంత అనువైన రోజు. ఈ పూజను తెల్లవారుజామున 4:30 నుంచి 6:00 లోపు బ్రాహ్మీ ముహూర్తంలో ఆచరించడం మంచిది. లేదంటే రాత్రి 10:00 గంటల నుంచి 12:00 గంటల మధ్యలో కూడా ఆచరించవచ్చు. తాంత్రిక సాధనలో ఈ సమయం అత్యంత శక్తిమంతమైన సమయంగా భావిస్తారు.
ఈ పూజ ప్రారంభించే ముందు తలారా స్నానం చేయాలి. అనంతరం పూజ చేసే ప్రదేశాన్ని గంగాజలంతో శుభ్రం చేయాలి. ఒక పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరచి, దానిపై పసుపు లేదా కుంకుమతో గణపతి యంత్రం లేదా మండలాన్ని వేయాలి. దీనినే మండలం ఏర్పాటు చేయడం అంటారు.
ఏర్పాటు చేసుకున్న మండలం మధ్యలో ఉచ్చిష్ట గణపతి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించుకోవాలి. నువ్వుల నూనె లేదా ఎర్ర చందనం నూనెతో దీపారాధన చేయాలి. ఎర్రటి పువ్వులు, గరిక గణపతికి సమర్పించాలి. ముందుగా గణపతికి షోడశోపచారాలు చేయాలి. తర్వాత అష్టోత్తర శతనామాలతో గణపతిని పూజించాలి.
అనంతరం కొబ్బరికాయ, అరటిపండ్లు, అన్నం, పప్పు, పరమాన్నం వంటి నైవేద్యాలు సమర్పించాలి. ఈ పూజలో ముఖ్యమైన నియమం ఏమిటంటే దీపారాధన పూర్తిగా కొండెక్కే వరకు వినాయకునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి. గణేశుని మూల మంత్రాన్ని 108 సార్లు జపించాలి. జపం పూర్తయ్యాక మన మనసులోని అభీష్టాలను గణపతికి నివేదించుకోవాలి.
