జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బసవేశ్వర చిత్రపటానికి అదనపు కలెక్టర్ లు, అధికారులతో కలిసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ, నాటి కాలంలోనే సమాజంలో అసమానతలను తొలగించి, సమానత్వాన్ని సాధించేందుకు బసవేశ్వర మహారాజ్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. మహిళల హక్కుల కోసం, మహిళ వివక్షత నిర్మూలన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బసవేశ్వర మహారాజ్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వర మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివాస్, మోహన్ సింగ్, పలువురు సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
