- అనుమతులు ఒకదానికి.. నిర్వహణ మరొకటి..
- రెసోనెన్స్ పేరిట అధిక వసూళ్లు…
- తల్లిదండ్రులపై మోయలేని ఫీజుల భారం..
- బుక్స్ పేరుతో 25వేల రూపాయలు వసూలు..
- ఒకే క్లాస్.. రెండు ఫీజులు..
- తమ పిల్లల టీసీలు తీసుకుంటున్న పేరెంట్స్..
- ఫిర్యాదులు ఉన్నా చర్యలు లేవా..?
- కార్పొరేట్ స్కూల్లకు అమ్ముడుపోయిన అధికారులు ??
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా రాంపల్లి దాయరలో విద్యా రంగంలో ఆందోళన కలిగించే పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పేరుతో అనుమతులు ఉన్నప్పటికీ, అదే సంస్థ రెసోనెన్స్ స్కూల్గా నిర్వహించబడుతుండటం వివాదానికి దారితీసింది. అనుమతులు లేకపోయినా అధిక ఫీజులను వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై డీఈవో, ఎంఈవోలకు ఫిర్యాదులు అందించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత తల్లిదండ్రులు మీడియాని ఆశ్రయించి తమ గోడును బయటపెట్టారు. ఒకే తరగతిలో చదువుతున్న విద్యార్థులకు విభిన్నంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఒకరికి రూ.70,000, మరొకరికి రూ. 1,70,000 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు.
అంతే కాకుండా బుక్స్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ. 25,000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఫీజుల భారాన్ని భరించలేక కొంతమంది తల్లిదండ్రులు మీడియా ముందు గళమెత్తుతుండగా, మరికొంత మంది తప్పనిసరి పరిస్థితుల్లో టీసీలు తీసుకుని ఇతర పాఠశాలలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, రెసోనెన్స్ స్కూల్ల మధ్య కుమ్మక్కుతో జరుగుతున్న ఈ ఫీజుల దందాను అడ్డుకోవాలని, సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
